Do not take loans through unauthorized apps – Complain about harassing apps

Share this news

చట్టబద్దత లేని యాప్ ల ద్వారా రుణాలు స్వీకరించవద్దు – వేదింపులకు పాల్పడే యాప్ ల పై ఫిర్యాదు చేయండి

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో గాని లేదా ఏవిధమైన బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డి.జి.పి కార్యాలయం స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్ ల ద్వారా అనేకమందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేదింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలపై డి.జి.పి కార్యాలయం నేడు ఒక ప్రకటన జారీచేసింది. ఆర్.బి.ఐ చట్టం 1934 లోని సెక్షన్ 45-1A ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందని తెలిపారు. ఆర్.బి.ఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని తెలియజేశారు.

ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ ఆన్ లైన్ యాప్ లలో అధికశాతం ఆర్.బి.ఐ లో నమోదు కాలేదని, అందువల్ల వారికి రుణాలు అందించే అధికారంలేదని పేర్కొన్నారు. ఈ యాప్ లలో అధికంగా చైనీస్ వే ఉన్నాయని, వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నెంబర్ గాని ఇతర వివరాలు ఉండవని తెలిపారు. ఫోన్ ద్వారానే సమాచారాన్ని (డేటా) ను యాప్ ల నిర్వాహకులు తెలుసుకుంటారని, ఈ యాప్ ల యూజర్లు లిఖితపూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు. యాప్ ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాదితులను వేదించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్ ల నిర్వాహకులు దుర్వినియోగం చేస్తారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులకు అంగీకరించవద్దని సూచించింది. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని తెలిపింది. ఇంటర్ నెట్ లో లభించే అనేక రుణాలు అందించే యాప్ లు మోసపూరితమైనవని, ఆర్.బి.ఐ గుర్తింపులేని ఈ యాప్ ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్ లోడ్ చేయకూడదని తెలియజేసింది.

ఈ యాప్ ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్.బి.ఎఫ్.సి రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా అత్యధికం. రుణబాదితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అయి రుణవలయంలో చిక్కుకుంటారు. దీంతో రుణాలు చెల్లించని రుణగ్రహితలను తిరిగి చెల్లించమని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్ లైన్ వేదింపులకు ఈ యాప్ లు పాల్పడుతాయి. రుణాలను చెల్లించనట్లైతే మీ పై క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని రుణం అందించే యాప్ లు బెదిరించే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డి.జి.పి కార్యాలయం తెలిపింది.

ఆర్.బి.ఐ లో రిజిస్టర్ కాని, అక్రమ యాప్ ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని డి.జి.పి కార్యాలయం ప్రజలకు సూచించింది. ఈ విషయంలో ఎవరైన వేదింపులకు గురయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డి.జి.పి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *