రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ముహూర్తం ఫిక్స్.. జూన్ 1 నుంచే ప్రారంభం.. సీఎం రేవంత్ చేతుల మీదుగా లాంచ్!

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ముహూర్తం ఫిక్స్.. జూన్ 1 నుంచే ప్రారంభం.. సీఎం రేవంత్ చేతుల మీదుగా లాంచ్!
తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది పేదలకు ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు రెండో విడత ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం కొఠారి గ్రామంలో జరిగే కార్యక్రమంలో సీఎం రెండో విడత ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో నెలలుగా ఎదురు చూస్తున్న అర్హులైన లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం సెకండ్ ఫేజ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించనుంది. మొదటి విడత తర్వాత రెండో విడత ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే వార్తగా మారింది.
ఇప్పటికే తొలి విడతలో ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, లబ్ధిదారులకు రూ.6,500 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం మరో 2 లక్షల ఇళ్లు కూడా తుది దశ నిర్మాణంలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
జూన్ 1, 2 తేదీల్లో తొలి విడతలో పూర్తయిన లక్ష ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొఠారి గ్రామంలో 28 మంది కొలాం ఆదివాసీల కొత్త ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా దశల వారీగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారు.
ఈ పథకం కింద నిర్మించే ఇళ్లు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఉండాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తుదారుల అర్హతలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఇళ్లను మంజూరు చేస్తున్నారు. దీంతో నిజమైన అర్హులకు మాత్రమే ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తోంది. GPS, AI టెక్నాలజీ సహాయంతో నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తోంది. అలాగే అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫిర్యాదులు అందిన 24 గంటల్లోనే స్పందించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత పారదర్శకంగా అమలవుతుందని అధికారులు చెబుతున్నారు.






