సమంత గురించి వచ్చిన వార్తలపై నాగ చైతన్య లీగల్ యాక్షన్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరో!
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్యకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తన వ్యక్తిగత జీవితం, మాజీ భార్య సమంతతో సంబంధం ఉన్న కొన్ని అభ్యంతరకర కథనాలు, AI ద్వారా రూపొందించిన కంటెంట్పై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
నాగ చైతన్య తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. కొన్ని వెబ్సైట్లు ఆయన పేరును అసభ్యకరమైన సెర్చ్ టర్మ్స్తో అనుసంధానం చేస్తూ ట్రాఫిక్ సంపాదిస్తున్నాయని ఆరోపించారు. అలాగే ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ను ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా సమంతతో ఆయన వివాహ బంధానికి సంబంధించిన పలు కథనాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కంటెంట్లలో నాగ చైతన్య సమంతను మోసం చేశాడని, ఆమె కెరీర్ను నాశనం చేశాడని ప్రచారం చేస్తున్నారని న్యాయవాది వాదించారు. ఇది విమర్శ కాదని, ఉద్దేశపూర్వక ట్రోలింగ్ అని కోర్టుకు వివరించారు.
ఇదే కాకుండా AI ఆధారిత డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్, వాయిస్ క్లోనింగ్ వంటి టెక్నాలజీలతో నాగ చైతన్యను అభ్యంతరకర పరిస్థితుల్లో చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కంటెంట్ ఆయన గౌరవం, వ్యక్తిగత గోప్యత, ప్రజా ఇమేజ్పై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
కొన్ని యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ కథనాలు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లబడ్డాయి. కొన్ని లింకులు తొలగించబడినప్పటికీ, మరికొన్ని ఇంకా అందుబాటులో ఉన్నాయని నాగ చైతన్య తరఫు న్యాయవాదులు వాదించారు.
విచారణ సందర్భంగా కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా పరిశీలనకు గురవుతారని, కానీ దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని జస్టిస్ జ్యోతి సింగ్ పేర్కొన్నారు. వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అనుమతించలేమని సూచించారు.
అలాగే నాగ చైతన్య ఫొటోలను ఉపయోగించి అనుమతి లేకుండా కొన్ని వస్తువులను విక్రయిస్తున్న అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నాగార్జున వ్యక్తిత్వ హక్కులకు కోర్టు రక్షణ కల్పించిన విషయాన్ని కూడా న్యాయవాదులు గుర్తు చేశారు.
ఈ కేసులో డైనమిక్ ఇంజంక్షన్ ఇవ్వాలని నాగ చైతన్య తరఫు న్యాయవాదులు కోరారు. ఎందుకంటే ప్రతిరోజూ కొత్త కంటెంట్ వెలుగులోకి వస్తోందని, ఒకటి తొలగించినా మరోటి ప్రత్యక్షమవుతోందని వాదించారు.
ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు. కోర్టు సమన్లు జారీ చేయడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులపై కూడా పరిశీలన చేస్తామని తెలిపింది.
ఇక నాగ చైతన్య, సమంత కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉండి 2017లో వివాహం చేసుకున్నారు. అనంతరం 2021లో విడిపోయారు. ప్రస్తుతం నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకోగా, సమంత తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.