‘Tourism Center of Excellence’ in Andhra Pradesh: Industries Minister Mekapati Gautam Reddy
![‘Tourism Center of Excellence’ in Andhra Pradesh: Industries Minister Mekapati Gautam Reddy](https://tanvitechs.com/wp-content/uploads/2020/09/gautham.jpg)
ఆంధ్రప్రదేశ్ లో ‘టూరిజం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఐటీడీసీ
అనకాపల్లిలో ఎన్టీపీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనకు సానుకూల స్పందన
వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ సంబంధిత సీవోఈ కు సానుకూలత
తొలి రోజు ఢిల్లీ పర్యటనలో ఐటీడీసీ, ఎన్టీపీసీ, ఎస్ఏఐల్ ల ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లతో భేటీ
అమరావతి, సెప్టెంబర్, 09; ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాబోతుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే భారత పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. బుధవారం ఐటీడీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలవర్ధనరావుతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. పర్యాటక రంగంలో ఉద్యోగావకాశాలు, శిక్షణకు సంబంధించిన సహకారాన్ని గౌతమ్ రెడ్డి కోరారు. *’హునర్ సె రోజ్ గర్’ కార్యక్రమంలో భాగంగా పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తామని ఐటీడీసీ ఛైర్మన్ తెలిపారు. హోటల్ మేనేజ్ మెంట్, వివిధ రకాల వంటలలో ప్రత్యేక శిక్షణ, పర్యాటకరంగంలో ఉద్యోగాల కల్పనకు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రతిపాదనలకు కమలవర్ధనరావు సానుకూలంగా స్పందించారు. అనంతరం , ఢిల్లీలోని లోథి హోటల్ లో మంత్రి మేకపాటి జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ సీఎండీ గురుదీప్ సింగ్ ను కలిశారు. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో ఎన్టీపీసీ సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం మంత్రి మేకపాటి ప్రతిపాదనపట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. మంత్రి మేకపాటి కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు, అప్రెంటిషిప్ కార్యక్రమాలలో భాగస్వామ్యానికి ఎన్టీపీసీ సీఎండీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనిల్ కుమార్ చౌదరితో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనను మంత్రి గౌతమ్ రెడ్డి సెయిల్ సీఎండీకి వివరించారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ద్వారా ఆర్థిక సహకారం అందించాలనీ కోరారు. సీవోఈ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం చెబుతామని ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చౌదరి మంత్రి ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. అయితే హెచ్ఆర్డీ కేంద్రాల ద్వారా పాఠశాల పూర్తి చేసిన విద్యార్థులకు, ఇంజనీరింగ్ యువత రాసే ‘గేట్’ పరీక్షలకు , అప్రెంటిషిప్ కార్యక్రమాలకు, శిక్షణలో తోడ్పాటు అందిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి హామీ ఇచ్చారు. అగ్ని, గాలి , కరెంట్ కొలిమిలలో యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలకు ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ భాగస్వామ్యంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కృషి చేస్తుందని మంత్రి మేకపాటి ప్రతిపాదనకు అనిల్ చౌదరీ బదులిచ్చారు. ప్రతీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ ఏర్పాటే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు పరిశ్రమలలో ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణతో పాటు రాష్ట్రంలో స్కిల్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు కోసం మంత్రి మేకపాటి తొలి రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీడీసీ, ఎన్టీపీసీ, ఎస్ఏఐల్ ల ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. సీఎండీలతో సమావేశాలలో మంత్రి మేకపాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ హాజరయ్యారు. గురువారం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయను పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమవుతారు.