స్కూల్స్ ప్రారంభం . ముగిసిన వేసవి సెలవులు! ఎప్పటినుంచి అంటే?
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12వ తేదీ నుండి తిరిగి ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం, మళ్లీ తరగతులు ప్రారంభించేందుకు పాఠశాలలు సన్నద్ధమవుతున్నాయి.
జూన్ 12న పాఠశాలలు రీఓపెన్ కావడంతో ఆ రోజునే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల హాజరు పెంచేందుకు జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక శ్రద్ధతో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి మండలస్థాయి సమావేశాలు, స్కూల్ కమిటీలు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే, జూన్ 7 నుంచి ఇంటింటికీ సందర్శించి పిల్లలను స్కూల్కు పంపించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి.
పాఠశాలల పునఃప్రారంభానికి ముందు సెక్యూరిటీ, శుభ్రత, మౌలిక సదుపాయాల పరిశీలన పూర్తయ్యేలా జిల్లా విద్యా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.