నేడు జగనన్న విద్యా దీవెన

నేడు జగనన్న విద్యా దీవెన
Spread the love

నేడు జగనన్న విద్యా దీవెన

ఈ ఏడాది రెండవ విడత విద్యాదీవెనలో భాగంగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ.693.81 కోట్లను క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమచేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

అమరావతి.
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….:

పిల్లలకు మన తరపున ఇచ్చే ఆస్తి చదువు..
ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
దేవుడి దయతో అక్షరాలా 10.97లక్షల పైచిలుకు పిల్లలకు దాదాపు రూ.694 కోట్లు నేరుగా 9,88,437 మంది తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిచెల్లెమ్మ, ప్రతి తమ్ముడు బాగా చదవాలని, వాళ్లకు మన తరఫు నుంచి ఇవ్వదగ్గ ఆస్తి ఏదైనా ఉందంటే అంది చదువే అని నేను చాలా గట్టిగా నమ్ముతాను.
మనసా, వాచా, కర్మేణా సంపూర్ణఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలన్న తపన, తాపత్రయం ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. దేవుడి దయ వలన ఈ కార్యక్రమం ఇవాళ చేయగలుగుతున్నాం.

ఉన్నత చదువులతోనే పేదరిక నిర్మూలన…
కొన్ని కొన్ని విషయాలను మనం పరిగణలోకి తీసుకొంటే ఇంకా మనం చాలా వెనకబాటులో ఉన్నాం. రాష్ట్రంలో చదువురాని వారు 2011 లెక్కలప్రకారం 33శాతం మంది ఉన్నారు. దేశంలో సగటు చూస్తే వీరు 27శాతం మంది ఉన్నారు. దేశం కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్ధానంలో ఉంది.
18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు ఇంటర్‌ పూర్తైన తర్వాత ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారని చూస్తే.. ఆశ్చర్యకరమైన నంబర్లు కనిపిస్తున్నాయి. మనం బ్రిక్స్‌దేశాలతో పోల్చిచూసుకుంటాం. ఇవన్నీ ఒకేరకమైన ఎకానమీ ఉన్న దేశాలు. బ్రిక్స్‌ అంటే బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా, ఇండియా దేశాలతో సరిపోల్చి చూస్తాం. ఈ వయస్సు పిల్లలు ఎంత మంది ఇంటర్‌ తర్వాత కాలేజీలకు పోతున్నారో చూస్తే.. బ్రెజిల్‌లో దాదాపు 51.8 శాతం, రష్యాలో 83.4 శాతం, చైనాలో 54.7 శాతం పిల్లలు చేరుతున్నారు. మన దేశంలో కేవలం 27శాతం మాత్రమే కాలేజీలకు వెళ్తున్నారు. దాదాపు 73శాతం మంది పిల్లలకు ఇంటర్మీడియట్‌ అయిన తర్వాత కాలేజీల్లో చేరడంలేదు. పిల్లలు పై చదువులు చదవకపోతే, పై స్ధాయి ఉద్యోగాలు సాధించలేకపోతే పేదరికాన్ని ఎప్పుడూ తీసేయలేం.

తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదనే…
పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రావాలి. ఆ చదువులు కోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకుండా, అవి పిల్లలకు అందుబాటులోకి వచ్చినప్పుడే వారి తలరాతలు మారుతాయి.
అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద జీతాలు వచ్చే అవకాశాలుంటాయి, వారి జీవితాలు మారుతాయి.
ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి… అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే.. జగన్‌ అనే నేను నాలుగు అడుగులు ముందుకు వేశాను. ఆ దిశగా అడుగులు వేస్తూ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలలో ప్రతి పేదవాడికి, ఓసీల్లో ఉన్న పేద పిల్లలకు పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. వారి తల్లితండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితిని మారుస్తున్నాం.

అంతేకాక హాస్టల్‌ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.20వేలు ఇస్తున్నాం. వసతి ఖర్చులకోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదని కూడా మేం ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం.
వసతి దీవెన కింద ఈ డబ్బు ఇస్తున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెన కోసం ఇంతగా ఖర్చు చేస్తున్నాం.

ఆ ఘటననతో పరిస్ధితి మార్చాలని నిర్ణయం
నా పాదయాత్ర చేస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఘటన ఇప్పటికీ గుర్తు ఉంది. గోపాల్‌ అనే తండ్రి నా దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తంచేశాడు.
దారిలో నేను వెళ్తున్నప్పుడు తన ఇంటి దగ్గర కొడుకు ఫొటోతో ఫ్లెక్సీ పెట్టాడు. ఫీజు లక్షరూపాయులు అయితే ప్రభుత్వం నుంచి అరకొరగా రీయింబర్స్‌మెంటు వస్తుంది. అది కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థిది. రూ.30వేల ఫీజు ఇస్తున్నారు, రూ.70వేలు అప్పు ఏడాదికి చేయాల్సి వస్తోంది, దీన్ని చూసి తట్టుకోలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తండ్రి నాకు చెప్పాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చెప్పిన విషయం నా మనసుని ఎంత కలిచి వేసిందంటే… ఈ ఘటనను ఎప్పటికీ నేను మరిచిపోలేను. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలన్న తపన, తాపత్రయంతోనే అడుగులు వేస్తున్నాం.

నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్,మెడిసిన్‌ చదువుతున్న పిల్లలకు పూర్తిగా నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో రెండో సంవత్సరం కూడా అడుగులు బాగా ముందుకు వేయగలిగాం.
దేశంలో ఎక్కడా లేని విధంగా బకాయిలు లేకుండా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రతి త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నాం. వారు కాలేజీలకు వెళ్లి డబ్బులు కట్టే పరిస్థితి ఉంది.
దీనివల్ల దాదాపు 10.97 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. అందులో భాగంగా ఈయేడాది రెండో విడత కింద రూ.694 కోట్లు విడుదల చేస్తున్నాం.
గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం…
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సంవత్సరంలోనే గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన దాదాపు రూ.1800 కోట్లు తీర్చడమే కాకుండా, రూ.4,207 కోట్లు ఇవ్వడం జరిగింది.
ఈ రెండో ఏడాది ఎలాంటి బకాయిలు లేకుండా ఏప్రిల్‌ నెలలో మొదటి విడత కింద రూ.671 కోట్లు ఇచ్చాం. నేడు రెండో విడత కింద ఇస్తున్న సుమారు రూ.694 కోట్లతో కలిపి ఇప్పటివరుకు నేరుగా మ్తొతం రూ. 5,573 కోట్ల రూపాయలకుపైగా మనం పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లించాం. ఆ తల్లులకు అన్నగా, తమ్ముడిగా, పిల్లలకు మేనమామగా ఈ కార్యక్రమం చేశామని తెలియజేస్తున్నా.

తల్లులు తలెత్తుకునేలా…
మొదటి విడత ఏప్రిల్‌లో, రెండో విడత ఇవాళ చెల్లించగా, మూడో విడత డిసెంబర్‌లో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తాం. తల్లుల చేతికే డబ్బు ఇచ్చి, వారే నేరుగా ఫీజులు చెల్లించేలా చేశాం. తద్వారా కాలేజీల్లో వసతులు బాగాలేకపోతే తల్లులు తలెత్తుకుని కాలేజీలను నిలదీసే పరిస్ధితిని కల్పించాం. వారు డబ్బులు కడుతున్నారు కాబట్టి ఆ హక్కు వారికొస్తుంది.

రెండేళ్లలో విద్యారంగంలో ఖర్చు
విద్యారంగంలో ఇప్పటివరకూ మనం చేసిన ఖర్చు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్ల రూపాయలు జమచేశాం.
జగనన్న విద్యాదీవెన ద్వారా 18,80,934 మందికి రూ. 5,573 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మందికి రూ. 2,270 కోట్ల రూపాయలు, జగనన్న గోరుముద్దద్వారా రూ. 36,88,618 మందికి రూ.1600 కోట్లు, జగనన్న విద్యాకానుక ద్వారా 45 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా, రూ.650 కోట్ల రూపాయలు, మనబడి నాడు – నేడు కింద తొలిదశలో 15,205 స్కూళ్లల్లో రూ. 3564 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం ఖర్చుచేశాం.
మొత్తంగా 1,62,75,373 మందికి 26,677.82 కోట్లు విద్యారంగం మీదనే ఖర్చు చేశాం.

అంగన్‌వాడీల నుంచే చదువుల విప్లవం
ఇవి కాక అంగన్‌వాడీల్లో కూడా పీపీ1, పీపీ2 విధానాన్ని తీసుకొచ్చి అక్కడ కూడా చదువుల విప్లవం తీసుకురావాలని తాపత్రయ పడుతున్నాం. పిల్లలకు, గర్భవతులుగా ఉన్న తల్లులకు మంచి పౌష్టికాహారం అందించాలని వైయస్సార్‌ సంపూర్ణపోషణకోసం రూ.1800 కోట్లు పెట్టాం. ప్రతి అడుగులోనూ చదువుకు అత్యంత పెద్దపీట వేసే ప్రభుత్వం మనది. మన పిల్లలు బాగా చదవాలని అంగన్‌వాడీలను పీపీ1 గా మార్చి అక్కడ నుంచి ఇంగ్లిషుమీడియంను తీసుకు వచ్చాం, సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ను తీసుకు వచ్చాం. పీపీ1 నుంచి డిగ్రీ వరకు అన్ని చదువులు ఇంగ్లిషు మీడియంలో చదివించే గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టగలిగాం. విద్యాదీవెన, వసతి దీవెనల వల్ల పిల్లలు ఇంకా బాగా చదవాలని కోరుకుంటున్నా.

వసతి దీవెన
వసతి దీవెన మొదటి విడత ఏప్రిల్‌లో ఇచ్చాం, మళ్లీ డిసెంబర్‌లో రెండో విడత ఇస్తాం. వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న వారికి రూ.20వేల రూపాయలు వసతి, భోజనం కోసం ఇస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన రెండు కార్యక్రమాలతో పిల్లలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.

ఈ డబ్బులు పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఎందుకు జమ చేస్తున్నామంటే…
పిల్లల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లి వాల్లే పీజులు కట్టడం వల్ల కాలేజీల్లో పరిస్థితులను చూస్తారు, కాలేజీల యాజమాన్యాలను అడగలుగుతారు. కాలేజీల్లో కూడా జవాబుదారీతనం వస్తుంది.
ఏమైనా సమస్యలున్నా, సదుపాయాల లోపం ఉన్నా కూడా 1902కు కాల్‌చేస్తే.. ప్రభుత్వం వాటిమీద దృష్టి పెడుతుంది. ఆ కాలేజీల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే కార్యక్రమం చేపడుతుంది.

చివరగా…
పిల్లలకు భవిష్యత్తులో మంచి జరగాలని, గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని తపన,ఆరాటంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి దేవుడి దీవించాలని, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

అనంతరం ఈ ఏడాది రెండవ విడత విద్యాదీవెనలో భాగంగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ.693.81 కోట్లను కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేశారు.

ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఆహార పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కె హర్షవర్ధన్, కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: