ఇవి పాటించండి, కరోనా రమ్మన్నా రాదు.

ఇవి పాటించండి, కరోనా రమ్మన్నా రాదు.
Spread the love

కరోనాను ఎదుర్కొనడంలో బాధ్యతగా ఉందాం – ప్రాణాలు కాపాడుకుందాం

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేస్తోంది. అయితే ప్రజలు ఇబ్బందిపడకుండా నిత్యావసరాల కోసం కొన్ని సడలింపులు ఇచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే కరోనా వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలు మర్చిపోతున్నారు. మనం చేసే చిన్నచిన్న పొరపాట్లే వైరస్ మన దగ్గరికి వచ్చేలా చేస్తున్నాం. ఒక్కోసారి మన చిన్న నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి ఈ కర్ఫ్యూ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. ఒకవేళ తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే.. మాస్కు ధరించి, శానిటైజర్ దగ్గర ఉంచుకుని ఇతరలతో భౌతిక దూరం పాటించాలి. మనం ఎంత జాగ్రత్తగా మెలిగితే అంత మంచిది.

కర్ఫ్యూ సడలింపులు
నిత్యావసరాలు, ఆఫీసులు ఇతర అవసరాల కోసం ఉదయం 6నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలకు వెళ్లినపుడు భౌతిక దూరం పాటించడం లేదు. షాపు యజమానులు ఎన్ని సూచనలు చేసినా ముందుకు దూసుకువస్తూనే ఉన్నారు. షాపుల దగ్గర మార్కింగ్ చేసినా పాటించేవారు తక్కువగా ఉంటున్నారు. చాలా మంది చివరి గంటలో జనం తక్కువగా ఉంటారని భావించి 11గంటల తర్వాత బయటకు వస్తున్నారు. దీంతో చివరి గంటలో కూడా షాపులు, మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.

రద్దీ ప్రాంతాలు.. వైరస్ అడ్డాలు
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు, కిరాణా షాపులు, మాంసం దుకాణాలు, వైన్ షాపుల దగ్గర ఇప్పుడు కూడా గతంలోలాగే విపరీతమైన రద్దీ ఉంటోంది. ఇలాంటి రద్దీ ప్రదేశాలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే అక్కడే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే అన్ని మాస్కు ధరించడంతోపాటు ఇతరకు భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కిరాణా షాపుల దగ్గర గుంపులుగా, మందుల షాపుల దగ్గర తోపులాటలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓపిక అవసరం. కొంతసేపు కూడా ఆగలేక తోసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మనిషికి మనిషికి మధ్య కనీస దూరం లేకుండాపోతోంది. ఫలితంగా ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు.

మాస్కు ధరించడం
కరోనాను మన నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్కు ధరించడం ఎంతో కీలకం. ప్రతిఒక్కరూ మాస్కు పెట్టుకోవడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు కూడా విధిస్తున్నారు. అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్కును ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి. మాస్కును ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి.

భౌతిక దూరం
కరోనాను ఎదుర్కోనేందుకు మన దగ్గరున్న ఆయుధాల్లో భౌతిక దూరం పాటించడం ఒకటి. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోను, కిరాణా షాపులకు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు, ఆఫీసులో పనిచేసే సమయంలో, ప్రయాణ సమయంలో, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.

సబ్సు లేదా శానిటైజర్
మనం పనిచేసుకుంటున్న ప్రదేశంలోగానీ, ఇంట్లో గానీ, బయట కూరగాయలకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు ఇలా అనేక సార్లు మనం చేతులతో ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. అవే వస్తువలను మనకు తెలియకుండా ఎంతోమంది తాకి ఉంటారు. అందువల్ల కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంటికి రాగానే సబ్బుతో అయితే కనీసం 20 సెకన్ల నుంచి 40 సెకన్లపాటు మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వంట వండే ముందూ, వండిన తర్వాత, ఆహారం తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత, మాంసం, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేటప్పుడు, పిల్లలకు ఆహారం పెట్టే ముందు ఇలా ప్రతిసారి సబ్బు నీళ్లతో చేతులు శుభ్ర పరుచుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లినట్టయితే తప్పనిసరిగా శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం అవసరం.

కళ్లజోడూ ముఖ్యమే
ప్రస్తుత పరిస్థితుల్లో కళ్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది తాము అత్యంత భద్రమైన ఎన్95 మాస్క్ తప్పకుండా ధరిస్తామని, అయినా వైరస్ బారినపడ్డామని చెబుతూ ఉంటారు. ఇలాంటి వారు కళ్లజోడు వాడడం లేదు. కాబట్టి వీలైనంత వరకు కళ్లజోడు పెట్టుకోవడం మంచిది.

మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు:

  • టిఫిన్, టీ, ఫ్రూట్ జ్యూస్ సెంటర్ల దగ్గర ఎప్పటిలాగానే తీవ్రమైన రద్దీ ఉంటోంది. ఎక్కడా కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు పెట్టుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఫ్యాషన్ గా మాస్కులు ముఖానికి తగిలించుకుని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు.
  • మరికొంతమంది కరోనా లక్షణాలు ఉన్నా బయటకు చెప్పడం లేదు. కరోనా లక్షణాలు ముదిరిపోయి పరిస్థితి తీవ్రంగా మారినపుడు మాత్రమే బయటకు తెలుస్తున్నాయి. అలా చేయడం ద్వారా వారిని, వారి కుటుంబాన్ని, వారితో దగ్గరగా మెలిగిన వారిని కూడా ప్రమాదంలోనికి నెడుతున్నారు.
  • బయట తిండి, టీ, చాట్ మసాలాలు, బిర్యానీలు తినకపోవడం మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట తిండి తినడం వల్ల కరోనాను మనమే స్వయంగా ఆహ్వానిస్తున్నట్టు లెక్క.
  • కరోనాకి ఎవరూ అతీతులు కాదు. రాబోయే రోజుల్లో కరోనా బారినపడేవారి సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మనవరకు రాలేదని ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. అది మన బాధ్యతారాహిత్యాన్ని, విచ్చలవిడితనాన్ని తెలియచేస్తుంది.
  • కరోనా అనేది సాధారణ వ్యాధుల్లా పరిగణించి బాధ్యత లేకుండా తిరగమని కాదు. కరోనా సోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు పెట్టుకుని, ఇంటికి ఒకరు మాత్రమే బయటకు వచ్చి అవసరమైన పనిచూసుకు వెళ్లాలి. ఈ సూచనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం తగదు.
  • సాధ్యమైనంత వరకు చిన్న పిల్లల్ని బజారుకి, మార్కెట్లకు పంపకండి. ట్యూషన్ లు, చదువులు అని అత్యుత్సాహం వద్దు. ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం.
  • డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి మనకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. వారి శ్రమను గుర్తించి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వారిపై ఎక్కువ ఒత్తడిపడకుండా తగ్గిద్దాం.
  • ప్రస్తుతం కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వస్త్రం మాస్కు కన్నా భద్రమైన సర్జికల్ మాస్కు లేదా ఎన్95 మాస్కు వాడితే మేలు.
  • కళ్లను పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోడు వాడితే మరింత భద్రం
  • ద్విచక్ర వాహనదారులు తలను పూర్తిగా కప్పి ఉంచేలా హెల్మెట్ ధరించి దానికి ముందు అద్దం వేసుకుంటే చాలా వరకు భద్రంగా ఉంటారు. తలపై, జుట్టుపై వైరస్ అంటుకునే ప్రమాదం చాలా వరకు తప్పుతుంది.
  • ప్రతి ఒక్కరూ నెలకు సరిపడా నిత్యావరసరాలు ఒక్కసారే తెచ్చుకోండి. ఒకటి అర కావాల్సి వచ్చినా అవి అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి.
  • పట్టణాల్లో అయితే చాలా షాపుల యజమానులు డోర్ డెలివరీ కోసం వాట్సాప్ నంబర్లు ఇస్తున్నారు. వీలైనంత వరకు ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటే షాపుల దగ్గర రద్దీ తగ్గుతుంది.
  • అవకాశం ఉన్నవారు పెద్దపెద్ద షాపులకు వెళ్లకుండా ఆన్ లైన్ ద్వారా సరుకులు బుక్ చేసుకుని తెప్పించుకోవడం మరింత ఉత్తమం.
  • రైతు బజార్లలో కూరగాయలు తక్కువ రేటుకు దొరుకుతాయని ఆశపడవద్దు. ప్రస్తుతం రోడ్లపక్కన చాలా చోట్ల కూరగాయల షాపులు ఉంటున్నాయి. రేటు కొంచెం ఎక్కువైనా రద్దీలేని చోట కొనడం మంచిది. తక్కువ రేటు ఉంటాయని రైతు బజార్లకు వెళితే వైరస్ ను మీతోపాటు మీ ఇంటికీ ఆహ్వానించిన వారు అవుతారు.
  • ప్రస్తుత పరిస్థితుల్లో బయట టిఫిన్ సెంటర్లలో, రెస్టారెంట్లలో టిఫిన్లు, భోజనాల చేయడం మంచిది కాదు. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారం.. అది కూడా వేడిగా తినేందుకు ప్రయత్నించండి.
  • ఉదయం పూట మార్నింగ్ వాక్ లు అంటూ రోడ్లపైకి రాకుండా మీ ఇంటిపైన ఉండే డాబాల మీద నడవండి. లేదంటే మీ ఇంట్లోనే తిరగండి.
  • మానసిక వికాసానికి మంచి పుస్తకాలు చదవడం, ఆహ్లాదాన్నిచ్చే కార్యక్రమాలను టీవీలో చూడడం మంచిది.
  • పిల్లలకు కూడా వైరస్ పట్ల అవగాహన కల్పించండి. ఇంట్లోనే ఉంటారు కాబట్టి చెస్, క్యారమ్స్ లాంటి ఆటలు ఆడించడం, జనరల్ నాలెడ్జ్ పై పరీక్షలు పెట్టడం ద్వారా వారికి ఆసక్తి కలుగుతుంది.
  • ఇంట్లోనే ఉంటూనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగితే.. కరోనా వైరస్ ను త్వరగా కట్టడి చేయవచ్చు.

కరోనాపై జరిగే పోరాటంలో మనవంతు కర్తవ్యం నిర్వర్తిద్దాం.. బాధ్యతగా ఉందాం.. కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం..

==========
డాక్టర్ అర్జా శ్రీకాంత్
స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-1

tanvitechs

tanvitechs

2 thoughts on “ఇవి పాటించండి, కరోనా రమ్మన్నా రాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: